News

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.

గుండెపోటుతో ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. ప్రతి మండలంలోనూ ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చర్చనీయాంశంగా మారింది. అయితే రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు.

ఈ అనూహ్య సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్‌ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగింది. మృతుడు మర్రిపూడి మణికంఠది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమని మహేశ్వరం ఎస్సై నర్సయ్య వెల్లడించారు. మృతుడి సోదరుడు వెంకటేష్‌ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు.

మణికంఠ ఏడాది నుంచి కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్‌ మాట్లాడుతూ.. వారంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. మణికంఠ శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళుతున్నట్లు చెప్పాడన్నారు.

తర్వాత మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్‌ తనకు ఫోన్‌చేశాడని, మణికంఠ బ్యాటింగ్‌ అనంతరం ఒకే ఓవర్‌ బౌలింగ్‌ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడన్నారు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు.

మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. దీంతో మృతుడి ఇంట్లో తీవ్ర విషాదచాయాలు అలుముకున్నాయి. మృతుడు మర్రిపూడి మణికంఠ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker