మీరు పోగొట్టుకున్న ఫోన్లను మళ్ళీ తిరిగి పొందొచ్చు. ఎలానో తెలుసా..?

నా షాపులో ఫోన్ చార్జింగ్ పెట్టాను. కాసేపటి తర్వాత చూస్తే కనపడలేదు. సీసీ కెమెరాల్లో చూస్తే ఒకబ్బాయి దొంగతనం చేస్తున్నట్లు కనపడింది. ఫిర్యాదు ఇవ్వడం, ఫాలోఅప్ చేయడం కష్టమని…కొత్త ఫోన్ కొనుక్కున్నా. అయితే ఈ రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. డిజిటిల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. చాలా విలువైన డేటా ఫోన్లలోనే ఉంటుంది. ఫోన్ పోగొట్టుకుంటే అంతే సంగతులు.
పర్సనల్ డీటేల్స్ మొదలుకుని, బ్యాంక్ పాస్వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ప్రమాదంలో పడతాయి. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి భారత ప్రభుత్వం ఓ పోర్టల్ను లాంచ్ చేయనుంది. దీని ద్వారా పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయవచ్చు.వివరాల్లోకి వెళ్తే.. భారత ప్రభుత్వం మే 17న CEIR ట్రాకింగ్ సిస్టమ్ను సంచార్ సాథీ పోర్టల్ పేరిట అందుబాటులోకి తీసుకొస్తోంది.

CEIR ట్రాకింగ్గా పేర్కొనే ఈ పోర్టల్ ద్వారా భారతదేశం అంతటా స్మార్ట్ఫోన్ వినియోగదారులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన తమ ఫోన్లను బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం రోజున సంచార్ సాథీ పోర్టల్ లాంచ్ కానుంది. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా పోర్టల్ను ఆవిష్కరిస్తారు. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. అన్ని టెలికాం సర్కిల్లను కవర్ చేస్తుంది.
ఇనీషియల్గా CEIR పోర్టల్ ఢిల్లీ , మహారాష్ట్ర , కర్ణాటక , ఈశాన్య ప్రాంతంలో యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈ త్రైమాసికంలో భారతదేశం అంతటా డెప్లాయ్ అవుతుంది. ఎలా పని చేస్తుంది..సంచార్ సాథీ పోర్టల్.. మొబైల్ సబ్స్క్రైబర్ల భద్రతను మెరుగుపరచడం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) సహా కొన్ని మాడ్యూల్స్ను అందిస్తుంది.

అన్ని టెలికాం నెట్వర్క్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన డివైజ్లను ట్రేస్ చేయడానికి, బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్)గా పేర్కొనే మరొక మాడ్యూల్, వినియోగదారులు వారి పేరులోని మొబైల్ కనెక్షన్ల సంఖ్యను ధ్రువీకరించడానికి, ఏదైనా అనవసరమైన లేదా అనధికార కనెక్షన్లను రిపోర్ట్ చేసే అవకాశం కల్పిస్తుంది. సిమ్ కార్డ్ దుర్వినియోగం కాదు.
ఈ పోర్టల్ ఎండ్ యూజర్ సెక్యూరిటీ, టెలికాం, సమాచార భద్రతపై తాజా సమాచారం, మెటీరియల్లను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వారి సిమ్ కార్డ్ నంబర్లను యాక్సెస్ చేయవచ్చు, అనధికార వినియోగాన్ని నిరోధించవచ్చు. సిమ్ కార్డ్ దుర్వినియోగం అయినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవచ్చు. భారత ప్రభుత్వం మొబైల్ డివైజ్లను విక్రయించే ముందు వాటి 15-అంకెల IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లను బహిర్గతం చేయాలనే కొత్త రిక్వైర్మెంట్ను ఇంప్లిమెంట్ చేసింది.

నెట్వర్క్లోకి అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంది. టెలికాం కంపెనీలు, CEIR సిస్టమ్ IMEI నంబర్లు, వాటి లింక్డ్ మొబైల్ నంబర్లకు యాక్సెస్ కలిగి ఉంటాయి. CEIR సిస్టమ్ ద్వారా కోల్పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ డివైజ్లను ట్రాక్ చేయడానికి ఈ సమాచారాన్ని ఇప్పటికే నిర్దిష్ట రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు.