భూమిపైకి గ్రహాంతర వాసులు వచ్చారా..? నాసా నివేదికలో సంచలన విషయాలు.
భూమిపై మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాలపై కూడా గ్రహాంతర వాసులు జీవిస్తున్నారనే అంచనా ఉంది. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు. కొంత సమాచారం సేకరించారు. వారి అంచనా ప్రకారం.. గ్రహాంతరవాసులు నివసించే గ్రహం యురేనస్ పరిమాణంలో ఉండవచ్చు. ఈ గ్రహం మన సౌరకుటుంబం చివర ఉండి ఉండొచ్చని చెబుతున్నారు.
అయితే ఎగిరే పళ్లేలుగా వ్యవహరించే యూఎఫ్ వో (అన్ ఐడెంటిఫయింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)లపై ప్రపంచమంతా చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నివేదికను నాసా విడుదల చేసింది. యూఎ్ఫవోలను ఈ నివేదికలో.. యూఏపీ (అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా)గా వ్యవహరించిన నాసా.. అవన్నీ గ్రహాంతరవాసులవేనని చెప్పడానికి ఎలాంటి హేతువూ లేదని అభిప్రాయపడింది. వీటిని భూ గోళానికి సంబంధించిన అతిగొప్ప రహస్యాల్లో ఒకటిగా అభివర్ణించింది.
యూఎ్ఫవోలకు సంబంధించి చాలా దృశ్యాలు, ఎంతో మంది అనుభవాలు ఉన్నప్పటికీ.. సవివరమైన, స్థిరమైన పరిశీలనలేవీ లేవని, కాబట్టి వాటిపై స్పష్టమైన, శాస్త్రీయ నిర్ధారణలకు రావడానికి అవసరమైన సమాచారం లేదని వివరించింది. వాటిపై అధ్యయనానికి మరిన్ని కొత్త శాస్త్రీయ పరిజ్ఞానాలు, మరింత అత్యంత అధునాతన ఉపగ్రహాలు కావాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రోదసిలో ఉన్న శాటిలైట్లు.. చాలా చిన్నగా ఉండే యూఏపీలను గుర్తించలేవని పేర్కొంది.
ఇప్పటి వరకూ గుర్తించిన యూఎ్ఫవోల్లో కొన్నింటి వేగం.. ఇప్పటివరకూ మనకు తెలిసిన వైమానిక పరిజ్ఞానాలను మించినదని వెల్లడించింది. ఈ మిస్టరీని ఛేదించడానికి, యూఏపీల మూలాలను కనుగొనాలంటే.. నాసాకున్న విస్తృత సాంకేతిక పరిజ్ఞానానికి, శాస్త్రజ్ఞుల నైపుణ్యానికి కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా తోడవ్వాలని, ఓపెన్సోర్స్ యాప్ల ద్వారా ప్రజలను కూడా ఈ పరిశోధనల్లో భాగస్వాములను చేయాలని సూ చించింది.
కాగా.. యూఏపీలపై మరింత సమాచారాన్ని సేకరించాలంటూ నిపుణుల ప్యానెల్ ఒకటి సూచించిన నేపథ్యంలో.. వీటిపై పరిశోధనకు నాసా ‘డైరెక్టర్ ఫర్ యూఏపీ’ని నియమించింది. వెయ్యేళ్లనాటి గ్రహాంతరవాసుల మృతదేహాలు దొరికాయంటూ.. మెక్సికో చట్టసభలో వాటిని ప్రదర్శించిన మర్నాడే నాసా ఈ నివేదికను విడుదల చేయడం విశేషం. అంతేకాదు.. విశ్వంలో ఎక్కడో ఒకచోట జీవం ఉందనే విషయాన్ని తాను నమ్ముతున్నానని నాసా చీఫ్ బిల్ నెల్సన్ పేర్కొనడం గమనార్హం.