Health

మేనరికం పెళ్లి తర్వాత పుట్టిన పిల్లలకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందా..?

మేనరికం పేరుతో దగ్గరి బంధువులను పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ.. పెండ్లికి ముందు, తర్వాత జన్యు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. అయితే బిడ్డలో లోపాలెందుకు..ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు పిండం ఏర్పడే విధానాన్నితెలుసుకోవాలి.

ఒక మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. అంటే మొత్తం 46 క్రోమోజోములు. వీటిలో 23 మహిళ నుంచి, 23 పురుషుడి నుంచి వస్తాయి. అవి కలిసి ఒక కణంగా ఏర్పడతాయి. ఆ కణం పిండంగా మారుతుంది. ఇక ఈ క్రోమోజోములు ఎన్నో జన్యువుల సమ్మిళితం. ఈ జన్యువులే తండ్రి నుంచి, తల్లి నుంచి పోలికలను మోసుకొస్తాయి. వేరువేరు కుటుంబాలకు చెందిన స్త్రీ, పురుషుడు కలవడం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. దానికి కారణం తల్లి నుంచి వచ్చిన జన్యువు క్వాలిటీ లేకుండా చెడిపోయి ఉండొచ్చు.

అప్పుడు పురుషుడి నుంచే వచ్చే జన్యువు ఆరోగ్యకరంగా ఉంటే అది స్త్రీ జన్యువును డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు పుట్టే బిడ్డలో ఎలాంటి లోపాలు ఏర్పడకపోవచ్చు. కానీ ఒకే కుటుంబానికి చెందిన స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే ఇద్దరి జన్యువులు ఒకేలా ఉండొచ్చు. అంటే అనారోగ్యకర జన్యువులు కలవచ్చు. అప్పుడు పుట్టే బిడ్డలో ఏమైనా లోపాలు తలెత్తవచ్చు. అందుకే మేనరిక వివాహాలకు దూరంగా ఉండమని చెబుతారు వైద్యులు. ఎలాంటి లోపాలు రావచ్చు. మేనరికం వివాహాలు చేసుకున్నవారికి పుట్టుకతోనే లోపాలతో బిడ్డలు పుట్టే అవకాశం ఉంది.

అలాగే థలసీమియా, మూత్రపిండాల వ్యాధులు, కండరాలు, నరాల వ్యాధులు, బుద్ధిమాంద్యం, శ్వాససంబంధిత సమస్యలు, గుండెలో రంధ్రాలు… వంటి అనారోగ్య సమస్యలు మేనరికానికి పుట్టిన బిడ్డల్లో కలగచ్చు. అలాగని మేనరికపు వివాహాలు చేసుకున్న అందరికీ ఇలాంటి పిల్లలే పుడతారని చెప్పలేం. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్నవారిలో 4 నుంచి 6 శాతం మందికి పుట్టిన పిల్లల్లో ఇలా జరగొచ్చు. గర్భం దాల్చాక.. జన్యుపరమైన సమస్యలను అడ్డుకోవడం చాలా కష్టం. ఒక్కసారి గర్భం వచ్చాక వైద్యులు కూడా ఏమీ చేయలేరు.

కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ ఎప్పటికప్పుడు బిడ్డ ఆరోగ్యాన్ని, లోపాలను తెలుసుకుంటూ ఉండాలి. సమస్య మెదడుకు సంబంధించినది అయినా, సరిచేయలేనిది అయినా ఏం చేయాలో వైద్యులే సలహా ఇస్తారు. ఒక్కోసారి గర్భస్రావం చేసుకోమని కూడా సలహా ఇస్తారు వైద్యులు. అలాంటివి అయిదు నెలల గర్భంలోపలే మనదేశంలో అనుమతిస్తారు. గర్భం రాకముందు.. మేనరికపు వివాహాలను చేసుకున్నవారు గర్భం దాల్చడానికి ముందే వైద్యులను కలిసి జాగ్రత్తపడడం ముఖ్యం. జెనెటిక్ కౌన్సిలింగ్ కు వెళ్లడం ఉత్తమం. వైద్యులు సంప్రదించి వారు చెప్పిన మందులు వాడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker