YCPకి అంబటి రాయుడు గుడ్బై..! రాజీనామాకి అసలు కారణం ఇదే.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/rayudu7978879465-780x470.jpg)
రాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పొన్నూరు, గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని వైసీపీలోని సీనియర్ రాజకీయ నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. మరి కొందరు సీనియర్ నేతలేమో.. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం రాయుడికి బెస్ట్ ఆప్షన్ అనిభావిస్తున్నారట. అయితే స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు సడెన్ ట్విస్ట్ ఇచ్చారు.
తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. “వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా” అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు.
అంబటి రాయుడు మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ఇదివరకు పాల్గొన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చడంతోనే పార్టీలోకి వచ్చానని చెప్పారు.
ఐతే.. ఆయన గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపారనీ, అందుకు సంబంధించి వైసీపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లే యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నరసారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును, గుంటూరు నుంచి బరిలో దింపాలని హైకమాండ్ చూస్తోందని సమాచారం.
అందువల్ల రాయుడికి మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేసినా, అది ఆయనకు నచ్చలేదని టాక్. వాస్తవంగా ఏమైందన్నది అంబటి రాయుడు చెబితే తప్ప తెలియదు.